వాషింగ్టన్, 4 జూలై (హి.స.) ఉగ్రదాడులకు పాల్పడిన వారిని భారత్ వదిలిపెట్టబోదన్న సందేశాన్ని ‘ఆపరేషన్ సిందూర్’తో ప్రపంచానికి స్పష్టంగా తెలియజేశామని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. క్వాడ్ సమావేశంలో పాల్గొనడానికి వాషింగ్టన్ వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘‘ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను శిక్షించడమే ఆపరేషన్ సిందూర్ లక్ష్యం. ఆ విషయం ప్రపంచానికి స్పష్టంగా అర్థమైంది. పహల్గాం ఉగ్రదాడిని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలితో పాటు క్వాడ్ దేశాలూ తీవ్రంగా ఖండించాయి. ఆలస్యం చేయకుండా ఈ హింసాత్మక దాడికి పాల్పడిన వారిని చట్టం ముందు నిలబెట్టాలని పిలుపునిచ్చాయి’’ అని చెప్పుకొచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ