హైదరాబాద్, 5 జూలై (హి.స.)
, : నగరంలో అత్యంత రద్దీ ఉన్న జంక్షన్లలో జేఎన్టీయూ ఒకటి. రోజుకు లక్షన్నర వరకు వాహనాలు ఇక్కడి నలువైపులా రాకపోకలు సాగిస్తుంటాయి. నిత్యం వేలాది మంది పాదచారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అటుఇటు దాటుతుంటారు. కొన్నిసార్లు వేగంగా వచ్చే వాహనాలు ఢీకొని గాయాలపాలవుతుంటారు. ప్రాణాలు సైతం కోల్పోయిన ఉదంతాలున్నాయి. ఈ నేపథ్యంలో ఆకాశమార్గంతో పాదచారులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది. ఉప్పల్ జంక్షన్లో మాదిరిగా ఇక్కడ కూడా అతి పెద్ద ఆకాశమార్గం నిర్మించేందుకు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలోని యూనిఫైడ్ మెట్రోపాలిట్ ట్రాన్స్పోర్టు అథారిటీ (ఉమ్టా) ప్రణాళిక సిద్ధం చేసింది. ఒక కన్సల్టెన్సీని నియమించి అధ్యయనం తర్వాత పనులను చేపట్టనున్నారు. ఈ ఏడాదిలోనే పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మెట్రోస్టేషన్, ప్రగతినగర్ రోడ్డు, జేఎన్టీయూ బస్స్టేషన్, లూలూమాల్ వైపు నుంచి సులువుగా పాదచారులు అటుఇటు వెళ్లవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ