వాషింగ్టన్ డిసి, 1 ఆగస్టు (హి.స.)70కి పైగా దేశాలపై సుంకాలను పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త సుంకాలు మరో వారం తరువాత అమల్లోకి రానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం పలు దేశాలపై కొత్త సుంకాలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. 70కిపైగా దేశాలపై 10 నుంచి 41 శాతం మధ్య సుంకాలను (టారిఫ్లు) విధిస్తూ శ్వేత సౌధంలో ఉత్తర్వులపై సంతకం చేశారు. వాణిజ్య లోటు కారణంగా టారిఫ్లు పెంచుతున్నట్టు తెలిపారు. ఇప్పటికే కుదిరిన వాణిజ్య ఒప్పందాల మేరకు కొన్ని దేశాలపై సుంకాల్లో మార్పులు చేసినట్టు వివరించారు.
కొత్త టారిఫ్స్లో భాగంగా భారత్పై ట్రంప్ 25 శాతం సుంకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక కెనడాపై సుంకాన్ని 25 నుంచి 35 శాతానికి పెంచారు. ఔషధాల అక్రమ దందాపై కెనడా అడ్డుకట్టవేయలేకపోవడం, అమెరికాపై ప్రతికార చర్యలకు దిగడం తదితర కారణాలతో కెనడాపై సుంకాన్ని పెంచినట్టు తెలిపారు.
ఆగస్టు 1 నుంచి కొత్త సుంకాలు అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా సుంకాల పెంపుపై అధికారిక ఉత్తర్వులు కూడా జారీ చేశారు. అయితే, ఈ పెంపు మరో వారం తరువాత అమల్లోకి రానుంది. ఇక పెంపునకు సంబంధించి అమెరికా ప్రభుత్వం కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఆగస్టు 7 లోపు వాణిజ్య నౌకల్లోకి చేర్చిన వస్తువులు ఆక్టోబర్ 5లోపు అమెరికాకు చేరితే కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. ఆ తరువాత దిగుమతి అయ్యే వస్తువులపై కొత్త సుంకాలు అమలవుతాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి