దిల్లీ: 8 ఆగస్టు (హి.స.) రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తుందన్న కారణంతో భారత్పై అమెరికా సుంకాలను రెట్టింపు చేయడంతో ఇరుదేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ టారిఫ్లపై న్యూదిల్లీతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తేల్చి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్రమోదీ కీలక భేటీకి సిద్ధమయ్యారు.
శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన ఉన్నతస్థాయి కేబినెట్ సమావేశం జరగనుంది. ట్రంప్ టారిఫ్ల (Trump Tariffs on India)పై భారత్ ఎలా స్పందించాలనే విషయంపై ఈ భేటీలో చర్చించే అవకాశాలున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమావేశం తర్వాత సుంకాలపై కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇప్పటికే ట్రంప్ సుంకాల (Trump Tariffs)పై మోదీ పరోక్షంగా స్పందిస్తూ దీటుగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. దేశంలోని రైతులు, మత్స్యకారులు, పాల ఉత్పత్తుల రంగంలోని వారి ప్రయోజనాలే తమకు ముఖ్యమని, ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ప్రధాని స్పష్టంచేశారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ