న్యూఢిల్లీ,13,సెప్టెంబర్ (హి.స.)బైరాబి-సాయ్రంగ్ లైన్ మొత్తం పొడవులో 54ు మేర బ్రిడ్జిలు, టన్నెల్సే ఉంటాయంటే ఇదెంత కష్టసాధ్యమైన ప్రాజెక్టు అనేది అర్థం చేసుకోవచ్చు. చిన్నవాటిని పక్కనపెట్టినా 55 ఎత్తైన బ్రిడ్జిలు కట్టారు. మరీ ముఖ్యంగా ఈ కొండ అంచు నుంచి ఆ కొండ అంచుకు మధ్యలో ఉన్న లోయ మీదుగా బ్రిడ్జిలు వేయడానికి దాదాపు ఆరుచోట్ల అతి ఎత్తైన పిల్ల్లర్లు వేయాల్సి వచ్చింది. 70 మీటర్ల నుంచి 114 మీటర్ల ఎత్తున్న పిల్లర్లు నిర్మించి, వాటిని కలుపుతూ ఇనుప గర్డర్లతో వేసిన ఆ బ్రిడ్జిలను చూస్తే ఇంజనీర్ల శ్రమ కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. అన్నిటికంటే ఎత్తైన 144వ నంబరు బ్రిడ్జి సాయ్రంగ్ స్టేషన్కు సమీపంలోనే ఉంది. మొత్తం 5 పిల్లర్లు ఉండగా, ఒక దాని ఎత్తు 114 మీటర్లు (374 అడుగులు). దేశంలోని రైల్వే ప్రాజెక్టుల్లో నిర్మించిన అతి ఎత్తైన పిల్లర్లలో ఇది రెండవది. మణిపూర్లో ఉన్న అతి భారీ పిల్లర్ ఎత్తు 141 మీటర్లు. ఇక కొండలను తొలుస్తూ వేసిన టన్నెల్స్ పొడవు మొత్తం లైన్లో 31 శాతం.
బైరాబి-సాయ్రంగ్ రైల్వే లైన్ను ఐజ్వాల్కు గేమ్ చేంజర్గా భావిస్తున్నారు. రాజధానికి రైల్ కనెక్టివిటీ ఏర్పడటంతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ముఖ్యంగా సరుకు రవాణా పెరగడంతో నిత్యావసరాల ధరలు తగ్గి ప్రజలకు పెద్ద ఊరట లభిస్తుంది. అలాగే మిజోరంలో విరివిగా లభించే అటవీ ఉత్పత్తులకు, ఉద్యాన ఉత్పత్తులకు, అక్కడ తయారయ్యే కళాకృతులకు బయటి మార్కెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ లైన్ను శనివారం ప్రధాని మోదీ ప్రారంభించగానే ఏకంగా ఢిల్లీకి కూడా రాజధాని ఎక్స్ప్రెస్ అందుబాటులోకి రావడం మిజోరం యువత ఉద్యోగావకాశాలను పెంచే అంశమే. ఇక పచ్చటి అందాలతో అలరారుతూ, ఏడాదిలో అత్యధిక కాలం జల్లులు పడుతుండే మిజోరంలో పర్యాటకం కొత్త పుంతలు తొక్కేందుకూ మార్గం సుగమమవుతుంది
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ