ముంబయి,13, సెప్టెంబర్ (హి.స.)వెండి వస్తువులు, ఆభరణాలకు హాల్మార్కింగ్ను తప్పనిసరి చేయడాన్ని 6 నెలల్లో శ్రీకారం చుట్టే అవకాశం ఉందని భారతీయ ప్రమాణా మండలి (బీఐఎస్) డైరెక్టర్ జనరల్ ప్రమోద్ కుమార్ తివారీ తెలిపారు. ఈనెల 1 నుంచి అమల్లోకి వచ్చిన ‘వెండి హాల్మార్కింగ్’ ఐచ్ఛిక అమలు ప్రక్రియ ఎలా ఉందో, ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశీలించాక.. ఏం చేయాలన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుందని వివరించారు. వెండి ఆభరణాల్లో వెండి స్వచ్ఛత ఎలా ఉందీ నిర్థారించుకునేందుకు, డిజిటల్గా ఆయా ధ్రువీకరణలు పరిశీలించుకునే వీలు ఇందువల్ల వినియోగదారులకు కలిగింది. ‘ప్రస్తుత ఐచ్ఛిక ప్రక్రియ అమలు తీరును పరిశీలించేందుకు 6 నెలలు సరిపోతుంది. అప్పుడు హాల్మార్కింగును తప్పనిసరి చేయాలా, వద్దా అన్నది నిర్ణయిస్తాం’ అని పేర్కొన్నారు.
సవాళ్లున్నాయ్: ప్రస్తుతం బంగారు ఆభరణాలకు హాల్మార్కింగ్ ప్రక్రియ తప్పనిసరి. వెండి ధర కూడా పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు చెల్లించిన నగదుకు తగిన స్వచ్ఛత ఆయా ఆభరణాలు, వస్తువుల్లో ఉందా అనేది నిర్థారించుకునేందుకు హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలనే డిమాండ్ వస్తోంది. వెండిని కరిగించి, చిన్నపాటి ఆభరణాలు తక్కువ విలువలో చేస్తుంటారని.. వీటికి హాల్మార్కింగ్ ధ్రువీకరణ పత్రాలు అందించడం కొంత సవాలేనని ప్రమోద్ అంగీకరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ