ముంబయి/న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.) పాకిస్థాన్తో కలిసి భారత్ ఆడనున్న ఆసియాకప్ క్రికెట్ మ్యాచ్పై రాజకీయంగా తీవ్ర దుమారం చెలరేగింది. ఆదివారం జరగనున్న ఈ మ్యాచ్పై విపక్షాలు ముఖ్యంగా మహారాష్ట్రలోని ప్రతిపక్షాలు భాజపా, బీసీసీఐపై శనివారం తీవ్ర విమర్శలు గుప్పించాయి. భారత్-పాక్ మ్యాచ్ను బహిష్కరించాలని, ఉగ్రవాదంపై మనదేశ వైఖరిని ప్రపంచానికి తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశమని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. ‘‘ఉగ్రవాదాన్ని ఎగదోసే పాకిస్థాన్తో క్రికెట్ ఆడడం అంటే, దేశ ప్రజల భావోద్వేగాలను అవమానించడమే. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని వ్యాపింపజేస్తోందని చెబుతున్న మీరే ఇప్పుడు ఆ దేశంతో క్రికెట్ ఆడుతున్నారు. భాజపా దేశభక్తి పేరుతో వ్యాపారం చేస్తోంది. సరిహద్దుల్లో మన సైనికులు ప్రాణాలు త్యాగం చేస్తుంటే, పాకిస్థాన్తో క్రికెట్ మ్యాచ్ ఆడడం ఏంటి?’’ అని ఆయన ప్రశ్నించారు. ఈ మ్యాచ్కు వ్యతిరేకంగా మహారాష్ట్ర అంతటా ‘సిందూర్’ నిరసనలు చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. దీనిలో భాగంగా తమ పార్టీ మహిళా కార్యకర్తలు ‘సిందూరం’ సేకరించి ప్రధాని కార్యాలయానికి పంపుతారని ఆయన తెలిపారు. ‘‘రక్తం, నీరు ఒకే దగ్గర ప్రవహించలేనపుడు, రుధిరం, క్రికెట్ ఒకచోటే ఎలా కలిసి ఉంటాయని మరో నేత ఆదిత్య ఠాక్రే ప్రశ్నించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ