న్యూఢిల్లీ,14,సెప్టెంబర్ (హి.స.): గృహ నిర్మాణ ప్రాజెక్టులు ఏ కారణంతోనైనా నిలిచిపోతే వాటిని పునరుద్ధరించడానికి ఒక నిధిని ఏర్పాటు చేసి సొంతింటి కలగనే సామాన్యుల ప్రయోజనాలను పరిరక్షించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. గృహ కొనుగోలుదారుల్ని బిల్డర్ల మోసం, దోపిడీల నుంచి కాపాడేందుకు విధానాలను రూపొందించాల్సిన రాజ్యాంగ బాధ్యత ప్రభుత్వంపై ఉందని జస్టిస్ జె.బి.పార్దీవాలా, జస్టిస్ ఆర్.మహాదేవన్లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) అధికారులు కోరల్లేని పులుల్లా మిగిలిపోరాదని, ఆ సంస్థల ఆదేశాలు సత్వరం అమలయ్యేందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. మరో కీలక ఉత్తర్వు కూడా జారీ చేసింది. కొనుగోలుదారుడు ఆస్తి విలువలో 20 శాతం చెల్లించిన తర్వాత కొత్త హౌసింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రతి రియల్ ఎస్టేట్ లావాదేవీని స్థానిక రెవెన్యూ యంత్రాంగం వద్ద రిజిస్టర్ చేయాలని కూడా న్యాయస్థానం పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ