ఢీల్లీ, 15 సెప్టెంబర్ (హి.స.)గత ఆర్థిక సంవత్సరానికి (2024-25) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ఐటీఆర్) దాఖలు చేసేందుకు గడువు ఈ రోజు (సెప్టెంబర్ 15)తో ముగియనుందని ఆదాయపు పన్ను శాఖ స్పష్టం చేసింది. గడువు పొడిగించారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని పేర్కొంది.
గడువు పొడిగింపు లేదు – ఫేక్ ప్రచారంపై క్లారిటీ
ఐటీఆర్ గడువు సెప్టెంబర్ 30 వరకు పెంచారు అంటూ కొంతమంది సోషల్ మీడియా వేదికలపై ప్రచారం చేస్తుండగా, ఆదాయపు పన్ను శాఖ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా ఈ విషయాన్ని ఖండించింది.
“జులై 31 చివరి తేదీగా ఉన్న గడువును ఇప్పటికే సెప్టెంబర్ 15 వరకు పొడిగించాం. ఇప్పుడు మరోసారి పొడిగించినట్టు వస్తున్న ప్రచారం అబద్ధం. ఐటీఆర్ దాఖలుకు సెప్టెంబర్ 15నే చివరి తేదీ. ఫేక్ న్యూస్ నమ్మకండి,” అని స్పష్టం చేసింది.
పన్ను చెల్లింపుదారులకు సహాయంగా కాల్స్, లైవ్ చాట్స్, వెబ్ సెషన్స్ వంటి సేవలతో రౌండ్ ది క్లాక్ హెల్ప్డెస్క్ను అందుబాటులో ఉంచినట్లు ఐటీ శాఖ వెల్లడించింది. ఐటీఆర్ దాఖలుపై సందేహాల నివృత్తికి ఇది ఉపయోగపడనుంది.
---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి