కర్నూలు, 15 సెప్టెంబర్ (హి.స.)నిన్నమొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తోంది. కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని పేర్కొంటున్నారు అన్నదాతలు.. ప్రస్తుతం మార్కెట్ లో కిలో ఉల్లి అర్ధ రూపాయి కూడా పలకడం లేదని.. కిలో 30 పైసలు మాత్రమే ఉందని పేర్కొంటున్నారు.. ప్రస్తుతం మార్కెట్ కు భారీగా ఉల్లి వస్తోంది.. క్వింటాల్ ఉల్లి 1200లకు కొనుగోలు చేస్తున్న మార్క్ఫెడ్.. కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వేలంలో కనీస ధర క్వింటాల్ 30 రూపాయలు పలుకుతోంది.. అంటే కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి దిగుబడి ఉన్నా.. రాబడి లేదని రైతుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
గతేడాది క్వింటాలుకు రూ.6వేలు..
గతేడాది ఉల్లి పంటకు క్వింటాలుకు సుమారు రూ.6,000 వరకు ధర వచ్చింది. దీంతో, ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది సాగు చేశారు. ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తోంది. వర్షాలు కురుస్తుండడంతో పంట కుళ్లిపోతుంది. ఉల్లిని కర్నూలు మార్కెట్కు తీసుకెళ్తున్నా కొనేవారు కరువయ్యారు. దీంతో, సరుకును తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలి వెళ్లిపోతున్న ఘటనలూ ఉన్నాయి. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని విక్రయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటివరకు 5 వేల టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 2 వేల టన్నుల సరకు మాత్రమే రైతుబజార్లు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్కు పంపినట్లు అధికారులు చెబుతున్నారు. మరో 3 వేల టన్నుల ఉల్లి నిల్వలు మార్కెట్లోనే ఉన్నాయి.
రెండు వారాలుగా మార్క్ఫెడ్ ద్వారా క్వింటా రూ.1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన సరకుకు ఇప్పటివరకు వేలం వేయగా వ్యాపారుల నుంచి స్పందన రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి