న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.)అస్సాం (Assam)కు చెందిన సివిల్ సర్వీస్ అధికారిణి నుపుర్ బోరాను పోలీసులు అరెస్టు చేశారు. భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణల నేపథ్యంలో ఆమె ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈక్రమంలో ఆమె ఇంట్లో నోట్ల కట్టలు, బంగారుఆభరణాలు లభ్యమయ్యాయి.
ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారుల బృందంలో నుపుర్ బోరా పని చేస్తున్నారు. గువాహటికి చెందిన ఆమెపై భూ కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు ఉన్నాయని సీఎం హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) ఆరోపించారు. బార్పేట్ జిల్లాలో సర్కిల్ ఆఫీసర్గా ఉన్నప్పుడు డబ్బుకు బదులుగా భూమిని లంచంగా తీసుకున్నట్లు తేలిందన్నారు. దీంతో గత ఆరు నెలలుగా ఆమెపై నిఘా ఉంచినట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సోమవారం ఆమె ఇంటితో సహా మరో మూడు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సోదాల్లో రూ.90లక్షల నగదుతో పాటు రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆమెను అరెస్టు చేసి విచారిస్తున్నట్లు వెల్లడించారు. కాగా.. సోదాల్లో దొరికిన డబ్బుతో పాటు నుపుర్ ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
సీఎం విజిలెన్స్ ఎస్పీ రోజీ కలిత మాట్లాడుతూ.. ఈ కేసుపై పూర్తి దర్యాప్తు కొనసాగుతుందన్నారు. నుపుర్పై చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దర్యాప్తులో మరిన్ని బయటపడతాయని వెల్లడించారు. కాగా.. బార్పేట్లో ఆమెకు సహాయకుడిగా పనిచేసిన లాట్ మండల్ సురాజిత్ డేకా నివాసంలో కూడా అధికారులు సోదాలు చేశారు. ఇతడిపై కూడా భూ కుంభకోణం ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ