న్యూఢిల్లీ,16,సెప్టెంబర్ (హి.స.) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పంజాబ్(Punjab)లోని అమృత్సర్, గురుదాస్పుర్ జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటన నేపథ్యంలో రాహుల్ అక్కడి పోలీసులపై ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న ఓ సరిహద్దు గ్రామాన్ని సందర్శించేందుకు పోలీసులు అభ్యంతరం తెలపడమే అందుకు కారణంగా తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. గురుదాస్పుర్లోని రావి నది అవతల ఉన్న సరిహద్దు గ్రామమైన తూర్లోని వరద బాధితులను కలవాలని రాహుల్ (Rahul Gandhi) అనుకున్నారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా పంజాబ్ పోలీసులు అందుకు నిరాకరించారు. ఈక్రమంలోనే రాహుల్ వారిపై విరుచుకుపడ్డారు.
రాహుల్: భారత భూభాగంలోనే నన్ను సురక్షితంగా ఉంచలేమని చెబుతున్నారా?.
పోలీసు అధికారి: మిమ్మల్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం.
రాహుల్: కానీ, రావి నది అవతల ఉన్న గ్రామాన్ని చూపిస్తూ.. భారతదేశం అని చెబుతున్నారు. ఇది భారత్ కాదా?. మీరు రక్షించలేనందున నన్ను అక్కడికి వెళ్లొద్దని చెబుతున్నారా? అంటూ ఆయన పోలీసులపై విరుచుకుపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ