నంద్యాల జిల్లా21 సెప్టెంబర్ (హి.స.)రూపనగుడి (ఉయ్యాలవాడ), వరద నీటిలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు చిక్కుకున్న ఘటన ఉయ్యాలవాడ మండలంలో శనివారం చోటుచేసుకుంది. తెల్లవారుజామున భారీ వర్షం కురవడంతో మండలంలోని ఎర్రవాగు, మన్నె వాగులు పొంగాయి. రూపనగుడి గ్రామ శివారులోని ఎర్రవాగుపై నిర్మించిన చెరువు అలుగుపై ఆరు అడుగుల మేర నీరు ప్రవహించింది. ఉదయం 5 గంటల సమయంలో హైదరాబాద్ నుంచి వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు, పులివెందులకు వెళ్తున్న పీఆర్ఎల్ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అలుగు దాటే క్రమంలో నీటి ఉద్ధృతికి మధ్యలో ఆగిపోయింది. బస్సులో ఉన్న 24 మంది ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. పొక్లెయిన్, క్రేన్, గజ ఈతగాళ్ల సాయంతో బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మరోవైపు తుడుమలదిన్నె, అల్లూరు గ్రామాల వద్ద మన్నెవాగు పొంగటంతో తాడిపత్రి, ఆళ్లగడ్డ, ప్రొద్దుటూరు, కర్నూలు, జమ్మలమడుగుకు రాకపోకలు స్తంభించాయి. శిరివెళ్ల మండలం నల్లమల అడవిలోని ఎర్రవంక వాగులో వజ్రాల వేట కోసం వెళ్లిన కొందరు వరద నీటిలో చిక్కుకోగా, వారిని స్థానికులు రక్షించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ