దిల్లీ: 25 సెప్టెంబర్ (హి.స.) ‘‘కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో బొగ్గు పైనా పన్నుల భారం తగ్గింది. ఫలితంగా విద్యుత్తు ధరల పైనా దాని ప్రభావం ఉంటుంది. జీఎస్టీ తగ్గింపు కారణంగా తరతమ భేదం లేకుండా దేశంలోని 140 కోట్ల మందికీ ప్రయోజం కలుగుతోంది. అందుకే ప్రస్తుతం దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ప్రజలపై భారాన్ని తగ్గించినందుకు ప్రధాని మోదీకి ధన్యవాదాలు’’ అని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం దిల్లీలో జరిగిన ఎకనమిక్ టైమ్స్ ఎనర్జీ లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. ‘‘జీఎస్టీ 2.0 ద్వారా బొగ్గుపై ఉన్న సెస్ను పూర్తిగా ఎత్తివేశాం. దీంతో బొగ్గు ఆధారిత ఉత్పత్తుల రంగాల ధరలు తగ్గుతాయి. బొగ్గు గనుల రంగంలో గతంలో అవినీతి తాండవం చేసేది. ఇప్పుడు ఆ పరిస్థితులను సమూలంగా మార్చేశాం. భవిష్యత్తులో విద్యుత్తు భద్రత విషయంలో బొగ్గే ప్రధాన పోషించనుంది. 2030 నాటికి బొగ్గు డిమాండ్ 1.6 బిలియన్ టన్నులకు చేరుతుందని అంచనా. ఇప్పటికే 220 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సాధిస్తున్నాం. 2030 నాటికి దీన్ని 500 గిగావాట్లకు తీసుకెళ్లాలన్నదే లక్ష్యం. 2047 నాటికి వికసిత భారత్ సాధించేందుకు ఇంధన భద్రతతో పాటు పర్యావరణ సుస్థిరత చాలా ముఖ్యం. ఈ రెండు లక్ష్యాలను సాధించేందుకు బొగ్గు, గనుల మంత్రిత్వశాఖ అంకితభావంతో పనిచేస్తోంది’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు