అమరావతి, 25 సెప్టెంబర్ (హి.స.)
Updated : 25 Sep 2025 11:03 IST
చిలకలూరిపేట: రోడ్డు ప్రమాదంలో వైద్యుడు, ఆయన కుమార్తె మృతి చెందిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం తాతపూడి వద్ద జాతీయ రహదారిపై చోటు చేసుకుంది పోలీసుల కథనం ప్రకారం.. తిరుపతికి చెందిన వైద్యుడు తంగేళ్ల వెంకట కిషోర్(42), ఆయన కుమార్తె అశ్వినందన(7) సహా ఏడుగురు కుటుంబసభ్యులు కారులో తిరుపతి నుంచి గుంటూరు వైపు బయలుదేరారు. ఈక్రమంలో తాతపూడి వంతెన వద్ద వీరి వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న తంగేళ్ల వెంకట కిషోర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన కుమార్తె అశ్వినందన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా.. చిలకలూరిపేట ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులు తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు బంధువులు కావడంతో.. ఆయన ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మృతుడు వెంకట కిషోర్ తిరుపతి స్విమ్స్ ఆసుపత్రిలో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య సంధ్య యాదవ్ కూడా వైద్యురాలు
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ