అమరావతి, 26 సెప్టెంబర్ (హి.స.)
150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో మెగా డీఎస్సీ పూర్తి చేయడం ఒక చరిత్ర అని విద్యాశాఖ మంత్రి లోకేశ్ అన్నారు. మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘యువగళం పాదయాత్రలో నిరుద్యోగ యువతతో మాట్లాడేవాడిని. అప్పుడే మెగా డీఎస్సీ ఆలోచన మొదలైంది. సీఎం చంద్రబాబు తొలి సంతకం డీఎస్సీపైన పెడతారని అప్పుడే చెప్పాను’’ అని మంత్రి తెలిపారు. ‘‘దేశానికి అధినేత అయినా ఒక గురువు దగ్గర చదువుకున్న విద్యార్థే. నాకు లైఫ్ టైం గురువు మా నాన్న సీఎం చంద్రబాబు. మిమ్మల్ని చూస్తుంటే నా టీచర్లు గుర్తొచ్చారు. స్కూల్లో మంజులా మేడం కొట్టిన దెబ్బలు, రమాదేవి మేడం నేర్పిన డిసిప్లిన్, ఇంటర్లో నారాయణ మాస్టారు బ్రిడ్జ్ కోర్సు పాఠాలు, అమెరికాలో ప్రొఫెసర్ రాజిరెడ్డి మార్గదర్శకత్వం ఎప్పటికీ మర్చిపోలేను. ప్రపంచంలో ఏ రంగంలో ఉన్నవారైనా, ఎంత గొప్పవారైనా తమ టీచర్లను గౌరవిస్తూనే ఉంటారు’’ అని లోకేశ్ చెప్పారు. ‘‘సీఎం చంద్రబాబు చెప్పిన విధంగా ఇకపై ఏటా డీఎస్సీ నిర్వహిస్తాం. నవంబరులో టెట్ చేపడతాం. వచ్చే ఏడాది మళ్లీ పారదర్శకంగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తాం’’ అని ఆయన ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలందరి ఆశీస్సులతో మాకు మూడు తరాలు డీఎస్సీ ప్రకటించే అవకాశం వచ్చింది. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ