అమరావతి, 27 సెప్టెంబర్ (హి.స.): వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాల్లో వాయుగుండం ఏర్పడింది. గడిచిన 6 గంటల్లో.. గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతోంది. వాయుగుండం ప్రస్తుతానికి పూరీకి 60 కిలోమీటర్లు.. గోపాల్పూర్(ఒడిశా)కి 70 కిలోమీటర్లు, కళింగపట్నం(ఏపీ)కి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయింది. గోపాల్పూర్కు దగ్గరగా దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలను వాయుగుండం దాటనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
ఈ రోజు (శనివారం) కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటించింది. తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి