కడప, 27 సెప్టెంబర్ (హి.స.) కడప నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై స్పందించిన కడప వన్టౌన్ పోలీసులు విజయలక్ష్మి, ఇస్మాయిల్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళితే, టీడీపీ నుంచి ఇటీవల బహిష్కరణకు గురైన విజయలక్ష్మి అనే మహిళ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఫిర్యాదు అందింది. ఆమె వ్యాఖ్యలను ఇస్మాయిల్ అనే వ్యక్తి సామాజిక మాధ్యమాల్లో ట్రోల్ చేశాడు.
ఈ నేపథ్యంలో కడప వన్ టౌన్ పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేశారు. అలాగే, సామాజిక మాధ్యమాల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ట్రోల్ చేసిన మరో 15 మందిని గుర్తించేందుకు పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై రౌడీషీట్ తెరుస్తామని పోలీసులు వెల్లడించారు.
ఈ ఘటనపై ప్రజల్లో చర్చ జరుగుతోంది. రాజకీయ విమర్శలు సహజమే అయినా, అసభ్య వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు అంగీకరించలేనివని పలువురు అభిప్రాయపడుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి