హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.) ఆసియా కప్ చరిత్రలో తొలిసారిగా
భారత్, పాకిస్థాన్ల మధ్య ఫైనల్ పోరు జరగనుంది. ఇప్పటికే ఈ సీజన్లో సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు పాకిస్థాన్ను రెండుసార్లు ఓడించి ఆధిపత్యాన్ని చాటుకుంది. నేడు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా (సెప్టెంబర్ 28, ఆదివారం) రాత్రి 8:00 గంటలకు మ్యాచ్ మొదలు కానుంది. సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది.
ఇక భారత జట్టు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్లూ కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. అయితే, సూపర్ ఫోర్ దశలో శ్రీలంకతో జరిగిన చివరి మ్యాచ్లో ఎదురైన ఇబ్బందులు జట్టును అప్రమత్తం చేశాయి. ఫైనల్కు ముందు సూర్యకుమార్ ఫామ్, శుభమన్ గిల్ స్థిరత్వం లేకపోవడం భారత్కు ఆందోళన కలిగించే అంశాలుగా ఉన్నాయి. మరోవైపు, పాకిస్థాన్ జట్టు గత రెండు ఓటముల ఒత్తిడితో ఫైనల్లోకి అడుగుపెడుతోంది. టీమిండియా జట్టుతో పోలిస్తే, పాకిస్థాన్ బ్యాటింగ్ లైనప్ బలహీనంగా కనిపిస్తోంది. షాహీన్ షా అఫ్రిదీతో పాటు ఇతర ఆటగాళ్లు ఫైనల్లో తమ ప్రభావం చూపిస్తేనే ఏవైనా ఆశలు ఉంటాయి. ఇక ఓపెనర్ అభిషేక్ శర్మ రెండు మ్యాచుల్లో పాక్ బౌలర్లను చిత్తుచేసి, పవర్ప్లేలో చెలరేగిపోతుండడంతో భారత్ కు ఓ ప్లస్ గా చెప్పవచ్చు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు