హైదరాబాద్, 28 సెప్టెంబర్ (హి.స.)
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి నేడు మొదటి పునాది రాయి చేశారు. ఈ నగర నిర్మాణానికి తొలి అడుగుగా, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీరాఖాన్ పేటలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) కార్యాలయానికి ఆయన శంకుస్థాపన చేశారు. దీనిని 7.29 ఎకరాల స్థలంలో, 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. 20 కోట్ల వ్యయంతో నాలుగు నెలల్లో పూర్తి కానుంది. ఈ కార్యాలయం ఫ్యూచర్ సిటీలోని అభివృద్ధి పనులకు, లేఅవుట్లకు, పరిశ్రమలకు అనుమతులు ఇవ్వనుంది. అదేవిధంగా, రావిర్యాల నుండి అమనల్ వరకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
దాదాపు 30 వేల ఎకరాల విస్తీర్ణంలో 765 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరగనుంది. ఇది మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ఏడు మండలాలు, 56 రెవెన్యూ గ్రామాలను కలుపుకొని ఉంటుంది. ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలతో సరికొత్త ఆర్థిక, సామాజిక కేంద్రంగా రూపొందే ఈ నగరం, దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో స్మార్ట్ సిటీగా నిలవనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..