తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 28 సెప్టెంబర్ (హి.స.)
వాహనాల నంబర్ ప్లేట్ల మార్పుపై వాహనదారులు ఆందోళన చెందవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా రవాణా శాఖ అధికారి లక్ష్మణ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత వాహనాలకు హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్(హెచ్ఎస్ఆర్పీ)లు బిగించేందుకు ఎలాంటి గడువు విధించలేదని స్పష్టం చేశారు. ఈ నెల 30వ తేదీలోగా హెచ్ఎస్ఆర్ పీ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, లేకుంటే రవాణా, పోలీసు శాఖల ఆధ్వర్యంలో జరిమానా విధిస్తారనే ప్రచారంలో వాస్తవం లేదని తెలిపారు. వాహనాలకు నంబర్ ప్లేట్ల మార్పు అంశం ఇంకా ప్రభుత్వ పరిశీలనలోనే ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఈ సందర్భంగా డీటీఓ సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు