విజయవాడ, 29 సెప్టెంబర్ (హి.స.)దసరా పండుగ సందర్భంగా విజయవాడలోని దుర్గమ్మ ఆలయం (Durgamma Temple)లో దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వం (AP Govt) ప్రతిష్టాత్మకంగా తీసుకుని భక్తుల సౌకర్యార్థం అనేక చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే మరో మూడు రోజులు దేవీ నవరాత్రులు (Devi Navarathri) ముగిసి పోతుండటంతో.. ఈ రోజు బెజవాడ దుర్గమ్మ (Bezawada Durgamma)ను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో కొండ కింది వరకు ఏర్పాటు చేసిన క్యూలైన్లు భక్తులతో నిండిపోగా.. వినాయక గుడి నుండి సుమారు 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు.
ఇదిలా ఉంటే ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్, టైల్ పాండ్, పులిచింతల ప్రాజెక్టుల గేట్లను ఎత్తిన అధికారులు వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజి (Prakasam Barrage)కి వరద పోటెత్తింది. దీంతో ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికలను అధికారులు కొనసాగిస్తున్నారు. ఎగువ నుంచి వరద తాకిడి భారీగా ఉండటంతో.. దుర్గమ్మను చూసేందుకు వస్తున్న భక్తులకు అధికారులు కీలక అలర్ట్ జారీ చేశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున దిగువన ఉన్న అన్ని ఘాట్లలో నది స్నానాలు నిషేధిస్తున్నట్లు (Ban on river bathing) ప్రకటించారు. అలాగే అమ్మవారిని దర్శించుకునేందు వచ్చిన భక్తుల కోసం ఏర్పాటు చేసిన మోటర్లు, టాపుల వద్దనే స్నానాలు చేయాలని ఈ మేరకు అధికారులు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి