దిల్లీ: 29 సెప్టెంబర్ (హి.స.)రాష్ట్ర హోదా కోసం ఇటీవల కేంద్రపాలిత ప్రాంతం లడఖ్ అట్టుడికింది. హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బీజేపీ కార్యాలయాన్ని తగలబెట్టడంతో పాటు సీఆర్పీఎఫ్ సిబ్బంది, వాహనాలపై దాడులు జరిగాయి. ఈ అల్లర్లలో నలుగురు మరణించగా, పదుల సంఖ్యలో మంది గాయాలపాలయ్యారు. అయితే, ఈ అల్లర్లను ప్రేరేపించారనే అభియోగంపై లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ను అరెస్ట్ చేశారు. విచారణలో అతడికి పాకిస్తాన్ గూఢచారితో సంబంధాలు ఉన్నాయని తేలింది. ఇప్పటికే, ఆయనకు సంబంధించిన ఎన్జీవోల్లో విదేశీ నిధుల అక్రమాలు జరిగాయని కేంద్రం విచారణ ప్రారంభించింది.
జైలు శిక్ష అనుభవిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో శనివారం తన భర్తకు పాకిస్తాన్తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలను తోసిపుచ్చారు. తన భర్త ఆర్థిక అక్రమాలకు, హింసను ప్రేరేపించాడనే అభియోగాలను ఆమె ఖండించారు. తన భర్త విదేశీ పర్యటనలు వృత్తిపరమైనవి, పర్యావరణ పరమైనవని ఆమె చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ