అమరావతి, 3 సెప్టెంబర్ (హి.స.)
వివిధ వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే.. రోజంతా కేటాయించాలి. బోలెడు రక్తం ఇవ్వాలి.. ఈసీజీ పరీక్ష కోసం క్యూలో ఎదురు చూడాలి. 2డీ ఇకోకు మరో గంట.. ఇలా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఎంతో సమయం పడుతుంది. కొత్త సాంకేతికతలు, ఆవిష్కరణలు ఈ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి. ఒకే పరికరంతో సుమారు 60 రకాల వైద్య పరీక్షలు చేసి.. నిమిషాల వ్యవధిలోనే రిపోర్ట్ ఇచ్చే హెల్త్ ఏటీఎంను దిల్లీకి చెందిన క్లినిక్స్ ఆన్ క్లౌడ్ అనే అంకుర సంస్థ రూపొందించింది.
రాష్ట్ర ప్రభుత్వం... పైలట్ ప్రాజెక్టుగా కింగ్కోఠిలోని జిల్లా ఆసుపత్రిలో, మలక్పేట ఏరియా ఆసుపత్రిలో ఈ ఏటీఎంలను ఏర్పాటుచేసింది. ఈ యంత్రంపై నిల్చుంటే ఈసీజీ, హెచ్బీఏ1సీ, లిపిడ్, హిమోగ్లోబిన్, మధుమేహం, రక్తపోటు, పల్మనరీ ఫంక్షన్, కార్డియో వాస్క్యులర్ అసెస్మెంట్, డెంగీ, మలేరియా తదితర అనేక రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తుంది. కొన్ని రక్త పరీక్షలకు రక్తం బొట్టు నమూనా ఇవ్వాల్సి ఉంటుంది. చెవి, గొంతు, ముక్కు భాగాలను పరీక్షించవచ్చు. కంటి పరీక్షలు చేయవచ్చు. ‘‘మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచనతో.. ప్రస్తుతం ఈ రెండు ఆసుపత్రుల్లో ఓపీకి వచ్చే రోగులకు హెల్త్ ఏటీఎంపై పరీక్షలు చేసి ఫలితాలను విశ్లేషిస్తున్నాం. విజయవంతమైతే మరిన్ని సర్కారు ఆసుపత్రుల్లో ఈ యంత్రాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది’’ అని వైద్య విధాన పరిషత్తు కమిషనర్ డాక్టర్ అజయ్కుమార్ ‘ఈనాడు’కు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ