హైదరాబాద్, 3 సెప్టెంబర్ (హి.స.)
కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్టు రద్దు
చేయాలని నీటిపారుదల శాఖ మాజీ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక మీ వద్దకు ఎలా వచ్చిందని ఎస్.కే. జోషి తరఫున న్యాయవాదిని హైకోర్టు ప్రశ్నించింది. పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికలో తనను అక్రమంగా ఇరికించారని, ఈ రిపోర్టును రద్దు చేయాలని ఎస్.కే. జోషి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ ముగిసే వరకు తనపై చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కమిషన్ నివేదికలో తనపై చేసిన ఆరోపణలు అక్రమం, చట్ట, రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ పై ఇవాళ విచారణ జరిపిన న్యాయస్థానం.. ఈ సందర్భంగా కమిషన్ నివేదిక మీ వద్ద ఉందా అని హైకోర్టు ప్రశ్నించింది. అసెంబ్లీలో కమిషన్ నివేదిక పెట్టారు కాబట్టి ఆ నివేదిక మా వద్ద ఉందని ఎస్.కే. జోషి తరఫున లాయర్ కోర్టుకు తెలిపారు. దాంతో అసెంబ్లీలో పెడితే ప్రజాప్రతినిధుల వద్ద ఉండాలి కానీ మీ వద్దకు ఆ నివేదిక ఎలా వచ్చిందని హైకోర్టు ప్రశ్నించింది. దాంతో ఈ రిపోర్టు వెబ్ సైట్ లో ఉందని జోషి తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. వెబ్ సైట్ నుంచి నివేదిక తొలగించాలని మేం ఆదేశించాం కదా అని హైకోర్టు గుర్తు చేసింది. ప్రశ్నించింది. కమిషన్ నివేదిక మీ వద్దకు ఎలా వచ్చిందో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ తదుపరి విచారణ వారం రోజుల పాటు వాయిదా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు