, హైదరాబాద్: హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆమ్స్టర్డామ్ షిపోల్ విమానాశ్రయానికి నేరుగా విమాన సేవలను కేఎల్ఎం రాయల్ డచ్ ఎయిర్లైన్స్ ప్రారంభించింది. ఇక్కడి నుంచి తొలి విమాన సర్వీసు బుధవారం బయలుదేరింది. ఈ మార్గంలో బోయింగ్ 777-200ఈఆర్ విమానాన్ని కేఎల్ఎం నిర్వహిస్తోంది. వారానికి 3 సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఇప్పటికే బెంగళూరు, దిల్లీ, ముంబయి నుంచి ఆమ్స్టర్డామ్కు విమాన సేవలు అందుబాటులో ఉన్నాయి. ‘హైదరాబాద్ వేగంగా వృద్ధి చెందుతున్న నగరం. భారత్ ఫార్మా రాజధాని. అనేక ప్రపంచ ఐటీ సంస్థలూ ఇక్కడ తమ కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ విమాన సేవలను అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషిస్తున్నాం’ అని సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మార్టెన్ స్టీనెన్ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ