తిరుమల, 4 సెప్టెంబర్ (హి.స.) తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సేవకు వచ్చే వాలంటీర్లకు శిక్షణ ఇచ్చేందుకు అర్హులైన శ్రీవారి సేవకులు దరఖాస్తు చేసుకోవాలని తితిదే ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. తితిదే వెబ్సైట్లో సేవకు సంబంధించిన నూతన మాడ్యూల్ను ఈవో జె.శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి ఆయన బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. శ్రీవారి సేవలో సంస్కరణలు చేపట్టామన్నారు. ‘సేవకులకు ఐఐఎం అహ్మదాబాద్, రాష్ట్ర ప్రభుత్వ డైరెక్టర్ ఆఫ్ ప్లానింగ్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తాం. ప్రొఫెషనల్స్, ఎన్ఆర్ఐలూ సేవలో పాల్గొనేందుకు త్వరలో ప్రణాళికలు సిద్ధం చేస్తాం’ అని వివరించారు. తిరుమలలో ఇటీవల బిగ్, జనతా క్యాంటీన్ల టెండర్లను గతంలో ఎన్నడూ లేనివిధంగా పారదర్శకంగా నిర్వహించినట్లు ఈవో జె.శ్యామలరావు తెలిపారు. ఈ ప్రక్రియను వీడియో తీశామన్నారు. రోజుకు సరాసరి నాలుగు లక్షలకుపైగా లడ్డూలను తయారు చేస్తుంటే అంతే స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయని అదనపు ఈవో వెంకయ్యచౌదరి తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ