ముంబై, 8 సెప్టెంబర్ (హి.స.)ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న రాజకీయ, ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో పలు దేశాల కేంద్ర బ్యాంకులు తమ భద్రత కోసం బంగారాన్ని భారీగా కొనుగోలు చేస్తున్నాయి. ముఖ్యంగా చైనా, భారత్ వంటి దేశాలు అమెరికా డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించుకునే వ్యూహంలో భాగంగా పసిడి నిల్వలను గణనీయంగా పెంచుకుంటున్నాయి. అంతర్జాతీయ ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం వంటి సంక్షోభ సమయాల్లో బంగారం సురక్షితమైన పెట్టుబడిగా నిలవడమే ఇందుకు ప్రధాన కారణం.
తాజా గణాంకాల ప్రకారం, చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా పదో నెలలో కూడా బంగారం కొనుగోళ్లను కొనసాగించింది. ఆగస్టు నెలలో కొత్తగా పసిడిని కొనుగోలు చేయడంతో ఆ దేశ నిల్వలు 74.02 మిలియన్ ఔన్సులకు చేరాయి. అంతకుముందు జులై చివరి నాటికి ఇవి 73.96 మిలియన్ ఔన్సులుగా ఉన్నాయి. బంగారంపై దీర్ఘకాలిక నమ్మకమే చైనాను కొనుగోళ్ల వైపు నడిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
మరోవైపు, భారత్ కూడా బంగారం నిల్వలను పెంచుకోవడంలో వెనుకబడలేదు. ఈ ఏడాది జూన్ నాటికి భారత రిజర్వ్ బ్యాంక్ వద్ద 880 మెట్రిక్ టన్నుల పసిడి నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ఇవి 840 మెట్రిక్ టన్నులుగా ఉండగా, కేవలం ఏడాది వ్యవధిలో 40 మెట్రిక్ టన్నుల (40,000 కిలోలు) బంగారాన్ని కొనుగోలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యధిక బంగారం నిల్వలు ఉన్న దేశాల జాబితాలో అమెరికా 8,133 మెట్రిక్ టన్నులతో మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాత జర్మనీ (3,350), ఇటలీ (2,452), ఫ్రాన్స్ (2,437), రష్యా (2,330) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చైనా 2,299 మెట్రిక్ టన్నులతో ఆరో స్థానంలో ఉండగా, స్విట్జర్లాండ్ (1,040) తర్వాత 880 మెట్రిక్ టన్నుల నిల్వలతో భారత్ ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. కేంద్ర బ్యాంకులు ఈ స్థాయిలో బంగారాన్ని కొనుగోలు చేస్తుండటంతో అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది బంగారం ధర 35 శాతానికి పైగా పెరిగి రికార్డు స్థాయికి చేరిన విషయం తెలిసిందే.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి