
ఢిల్లీ,13, జనవరి (హి.స.) గ్రీన్లాండ్ (Greenland)ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా రిపబ్లికన్ పార్టీకి చెందిన చట్టసభ సభ్యుడు రాండీఫైన్ ‘గ్రీన్లాండ్ విలీనం - రాష్ట్ర హోదా’ పేరుతో బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుతో ఆ ద్వీపాన్ని అమెరికాలో విలీనం చేసుకునేలా ట్రంప్ చర్యలు చేపట్టేందుకు అవకాశం లభిస్తుందని రాండీ అభిప్రాయం వ్యక్తంచేశారు. అమెరికా విరోధులు ఆర్కిటిక్లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని, తాము అలా జరగనివ్వబోమని వ్యాఖ్యలు చేశారు. ఆర్కిటిక్లో రష్యా, చైనాను ఎదుర్కోవడానికి ఈ చర్యలు కీలకమని వెల్లడించారు.
వెనెజువెలా మాజీ అధ్యక్షుడు మదురో నిర్బంధం తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump).. గ్రీన్లాండ్పై కన్నేశారు. ఆ ద్వీపాన్ని డెన్మార్క్ నుంచి దూరం చేసేందుకు.. అక్కడి ప్రజలకు డబ్బును ఎరగా వేయాలని యోచిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఒక్కో వ్యక్తికి 10వేల డాలర్ల నుంచి లక్ష డాలర్ల (భారత కరెన్సీలో రూ.8 లక్షల నుంచి రూ.89 లక్షల) మధ్య డబ్బు ఇచ్చేందుకు అమెరికా అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు