
చిత్తూరు, 03 జనవరి (హి.స.)ఏ ఆడపిల్లకైనా తండ్రి అంటే ఒక హీరో.. ఆయన ఇల్లు అనే రాజ్యానికి రాజైతే తాను ఇంటికి యువరాణి అని భావిస్తుంది. తండ్రికి కూడా కొడుకు కంటే బిడ్డపైనే ఎనలేని ప్రేమ ఉంటుంది. బిడ్డలో తన తల్లిని చూసుకొని మురిసిపోతాడు ప్రతి తండ్రి. తన బిడ్డకు రక్షణ కవచమై నిలుస్తాడు. కానీ కొందరి వల్ల తండ్రిబిడ్డల బంధానికే కళంకం వస్తోంది. వారు చేసే పాడు పనుల వలన సభ్య సమాజం తలదించుకుంటుంది. వావివరసలు మరచి మృగాల మాదిరి వారు చేసే వ్యవహారం మానవత్వానికి మాయని మచ్చగా పరిణమిస్తోంది. అటువంటి ఒక దురదృష్టకర ఘటన చిత్తూరు జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది.
పోలీసుల వివరాల ప్రకారం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి తన మొదటి భార్య కుమార్తెపై కన్నేశాడు. ఆమెకు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లాడు. తండ్రి ఏం చేస్తున్నాడో తెలియని ఆ బాలిక భయంతో వణికిపోయింది. ఇది గమనించిన బాలిక నానమ్మ అక్కడకు పరుగున వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసింది. అది గమనించిన ఆ నిందితుడు బాధిత బాలికను అక్కడే వదిలి పరారయ్యాడు. భయంతో ఉన్న బాలికను ఆమె నానమ్మ, తల్లి దగ్గరకు తీసుకొని ధైర్యం చెప్పారు.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV