
హైదరాబాద్, 08 జనవరి (హి.స.)
సంక్రాంతి సందర్భంగా సుందరీకరణ పనులు పూర్తి అయిన నగరంలోని చెరువులలో ఈ వారం కైట్ ఫెస్టివల్ (పతంగుల పండుగ)ను నిర్వహించేందుకు సన్నాహాలు అధికారులు చేస్తున్నారు. అందులో భాగంగా కూకట్పల్లి నల్లచెరువు వద్ద పతంగుల పండుగ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో చెరువు వద్ద సుందరీకరణ పనులు వేగంగా పూర్తి అవుతున్నాయి. నల్లచెరువు వద్ద సుందరీకరణ పనులను గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు.
పనులను త్వరగా పూర్తి చేసి పతంగుల పండుగకు ముస్తాబు చేయాలని ఆదేశించారు. నల్లచెరువు తో పాటు నగరంలోని తుమ్ముడి కుంట, బమ్ రుర్న్ దౌలా చెరువుల వద్ద పతంగుల పండుగకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. కూకట్పల్లి నల్లచెరువు వద్ద పతంగుల పండుగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారని సమాచారం. చెరువు పరిసర ప్రాంతాలను పూర్తి విద్యుత్ దీపాలతో అలంకరించడం, ప్రజలను ఆకర్షించే విధంగా చెరువు పరిసరాలను తీర్చిదిద్దాలని ఎటువంటి నిర్లక్ష్యం జరగకూడదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..