
హైదరాబాద్, 16 మార్చి (హి.స.)
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
(Budget meetings) ప్రారంభమైన క్రమంలో తొలిరోజే అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల (Six guarantees)పై అసెంబ్లీలో తక్షణమే చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ వద్ద నిరసన చేపట్టారు. అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం, కాంగ్రెస్ ప్రభుత్వంపై వారు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం రైతులను వెన్నుపోటు పొడుస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
తెలంగాణ సంపదను దోచుకుంటూ రాహుల్ గాంధీకి 'వెయ్యి కోట్లు' కప్పం కడుతున్నారంటూ వారు చేసిన నినాదాలు అక్కడ కలకలం రేపాయి. బీఆర్ఎస్ నిరసన నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీ పరిసరాల్లో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై చర్చించేందుకు అవకాశం ఇవ్వకుండా విపక్షాల గొంతు నొక్కుతున్నారని మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆరోపించారు. ఆరు గ్యారంటీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేసే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు