విజయవాడ యలమలకుదురు పార్వతి సమేత రామలింగేశ్వర ఆలయంలో ఇంటి.దొంగలు
అమరావతి, 22 మార్చి (హి.స.)విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవా
విజయవాడ యలమలకుదురు  పార్వతి సమేత రామలింగేశ్వర  ఆలయంలో ఇంటి.దొంగలు


అమరావతి, 22 మార్చి (హి.స.)విజయవాడ శివార్లలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యనమలకుదురు పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. భక్తులు స్వామి వారికి భక్తితో సమర్పించుకున్న హుండీ కానుకలను సాక్షాత్తూ ఆలయ అధికారులే కాజేయడం దేవాదాయ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అక్రమాలకు ఆలయ ఈఓ (EO) భవాని సూత్రధారిగా వ్యవహరించినట్లు విచారణలో తేలింది. ఆలయ హుండీ తాళాలు సాధారణంగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వద్ద ఉంటాయి. అయితే, ఈఓ భవాని తన సిబ్బందిని పంపి ఆ తాళాలను తెప్పించేవారు. ఈ క్రమంలో ప్రధాన అర్చకుడు సాగర్, ఆయన సహాయకుడు పూర్ణ ఆ తాళాలకు మారుతాళాలు (Duplicate Keys) తయారు చేయించారు. హుండీ లెక్కింపు సమయంలో కాకుండా, ఇతర సమయాల్లో మారుతాళాలతో హుండీలు తెరిచి నగదును మాయం చేసేవారు.

దొంగతనం బయటపడకుండా ఉండేందుకు ఆలయ మంటపంలోని 16 సీసీ కెమెరాలను ఆఫ్ చేసి మరీ ఈ దోపిడీకి పాల్పడేవారు. గత రెండేళ్ల కాలంలో సుమారు 10 లక్షల రూపాయల విలువైన కానుకలు ఈ విధంగా మాయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అంతేకాకుండా, బ్యాంకులో నగదు జమ చేసే సమయంలో నోట్ల కట్టల్లో అదనపు నోట్లు పెట్టి, ఆ తర్వాత ఆ అదనపు సొమ్మును ఈఓ భవాని పక్కదారి పట్టించేవారని గుర్తించారు. ఆలయ చైర్మన్ నరసింహారావు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పెనమలూరు పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. ఈ కేసులో ప్రధాన అర్చకుడు సాగర్, సహాయకుడు పూర్ణ, , తాత్కాలిక ఉద్యోగి రోసయ్యలను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఈఓ భవాని ప్రస్తుతం దీర్ఘకాలిక సెలవుపై పరారీలో ఉన్నారు. ఆమెపై శాఖాపరమైన చర్యలకు దేవాదాయ శాఖ సిద్ధమైంది. చినిగిన నోట్లను గోనె సంచుల్లో వేసి ఒక గుమస్తా ఇంటికి తరలించిన వైనం కూడా పోలీసుల తనిఖీల్లో బయటపడింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande