
హైదరాబాద్, 22 మార్చి (హి.స.)
తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే రైతుభరోసా (Rythu Bharosa) నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నదాత సంతోషం కోసం అన్నగా బాధ్యత తీసుకున్నానని, రైతును ధైర్యంగా సాగు మడిలో నిలబెట్టేందుకు భరోసా ఇస్తున్నానని చెప్పారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని సిద్ధిపేట జిల్లా నర్మెట గ్రామ వేదికగా మరోసారి మా పాలనలో రైతే రాజు అని రుజువు చేస్తూ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెటలో రూ.300 కోట్లతో నిర్మించిన ఆయిల్పామ్ కర్మాగారం పై కూడా సీఎం స్పందించారు. రైతులకు ఆర్థిక సాయంతో చేతులు దులుపుకోవడం కాదు.. కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామన్నారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిటు శంకుస్థాపన కూడా చేస్తున్నామని వెల్లడించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..