
హైదరాబాద్, 25 మార్చి (హి.స.)
హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకు చైన్ స్నాచర్స్
(Chain Snatchers) బరితెగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు ఇంటర్నెట్ కనెక్షన్ పేరుతో ఇంట్లోకి చొరబడి, మహిళను కత్తితో బెదిరించి బంగారు గొలుసును ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. మియాపూర్ (Miyapur)లోని ఓ ఇంట్లో మహిళ ఒంటరిగా ఉండటం గమనించిన దుండగుడు, తాను ఇంటర్నెట్ కనెక్షన్ రిపేర్ చేయడానికి వచ్చానని నమ్మించి ఇంట్లోకి వెళ్లాడు. అనంతరం తన వెంట తెచ్చుకున్న కత్తిని తీసి మహిళను బెదిరించాడు. ఆమె ఎదుర్కొనే ప్రయత్నం చేయగా, బాధితురాలి కళ్లలో పెప్పర్ స్ప్రే (Pepper Spray) కొట్టి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేశాడు. మహిళ అపస్మారక స్థితిలోకి వెళ్లగానే, ఆమె మెడలో ఉన్న సుమారు 4 తులాల బంగారు గొలుసును తెంచుకుని దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తేరుకున్న బాధితురాలు వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు