
ఢిల్లీ, 29 మార్చి (హి.స.)
తమ ఒప్పందానికి అంగీకరించని దేశాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న అమెరికాకు, ట్రంప్కు సొంత దేశంలో బిగ్ షాక్ తగులుతుంది. దేశ చరిత్రలో కనివినీ ఎరుగని రీతిలో లక్షలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నారు. 'నో కింగ్స్' (No Kings) గ్రూప్ ఆధ్వర్యంలో మార్చి 28న US వ్యాప్తంగా నిర్వహించిన ఈ నిరసనలు అగ్రరాజ్యాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్తో యుద్ధం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న నేపథ్యంలో, ఈ సైనిక చర్యల వల్ల ఇంధన ధరలు 35 శాతం పెరగడం, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జీవన వ్యయం భారమైంది. దీనికి నిరసనగా న్యూయార్క్, వాషింగ్టన్ DC, శాన్ ఫ్రాన్సిస్కో వంటి ప్రధాన నగరాలతో పాటు 3,000కు పైగా చిన్న పట్టణాల్లోనూ ప్రజలు భారీ ర్యాలీలు చేపట్టారు.
ఈ నిరసనల్లో కేవలం యుద్ధ వ్యతిరేకతే కాకుండా, అమెరికా ప్రభుత్వం అమలు చేస్తున్న కఠినమైన వలస విధానాలు (ICE దాడులు), రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనపై కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాషింగ్టన్లోని నేషనల్ మాల్ వద్ద వేలాది మంది ప్రజలు మాకు ప్రజాస్వామ్యం కావాలి - నిరంకుశత్వం వద్దు అంటూ నినదించారు. సెనేటర్ బెర్నీ సాండర్స్, నటుడు రాబర్ట్ డి నీరో వంటి ప్రముఖులు సైతం ఈ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. అక్టోబర్లో జరిగిన గత నిరసనల్లో 70 లక్షల మంది పాల్గొనగా, ఈసారి ఆ సంఖ్య కోటి దాటవచ్చని అంచనా వేస్తున్నారు, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద పౌర నిరసనగా మారుతోంది.
అయితే, ఈ భారీ ప్రదర్శనలపై అగ్రరాజ్యం గట్టిగానే స్పందిస్తోంది. ఇవన్నీ కేవలం వామపక్షాల కుట్ర అని, ప్రభుత్వ వ్యతిరేక శక్తుల నిధులతో కృత్రిమంగా సృష్టించిన నిరసనలని వైట్ హౌస్ కొట్టిపారేసింది. వీటిని హేట్ అమెరికా ర్యాలీలు (Hate America Rallies) గా అభివర్ణిస్తూ, దేశ భద్రత కోసం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుదోవ పట్టించడమే వీరి లక్ష్యమని ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో, మే 1న దేశవ్యాప్త సమ్మె (General Strike) కు కూడా కొన్ని సంఘాలు పిలుపునివ్వడం ఇప్పుడు మరింత ఉత్కంఠ రేపుతోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV