
రంగారెడ్డి, 31 మార్చి (హి.స)
కుటుంబ తగాదాలు, మద్యం మత్తు
కారణంగా విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కట్టుకున్న భార్య, కన్న కొడుకు, కూతురిపై రోకలి బండతో దాడి చేశారు. ఈ దాడిలో భార్య, కుమారుడు చనిపోగా తీవ్ర గాయాలతో కూతురు ఉస్మానియా ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నది. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆమనగల్లు మండలం సీతారాం నగర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని పులిగోని పల్లి తండాకు చెందిన బాణావత్ రాందాస్ నాయక్ కు భార్య కవిత (28)తోపాటు ముగ్గురు ఆడపిల్లలు ప్రణీత (8) పావని (10) పవిత్ర (11) పావని, మగ సంతానం కుమారుడు హర్షిత్ (5) ఉన్నారు.పవిత్ర, పావని ఇద్దరు ఆడపిల్లలు హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, మద్యానికి బానిసైన రాందాస్ తరచు భార్యతో గొడవపడేవారని స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి మద్యం మత్తులో మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మత్తులో ఉన్న రాందాస్ భార్య కవిత, కుమారుడు హర్షిత్, కూతురు ప్రణీతపై రోకలిబండ, కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు తెలుస్తుంది. దాడిలో కవిత, కుమారుడు హర్షిత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే కన్నుమూయాగ, తీవ్రంగా గాయపడిన ప్రణీత ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఏసీపీ జానకి రెడ్డి, ఆమనగల్లు, తలకొండపల్లి ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు, జానకిరామ్ రెడ్డి ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బాధిత కుటుంబానికి ఏసీపీ జానకి రెడ్డి రూ.5వేల సాయం అందచేశారు. నిందితుడు రాందాస్ పోలీస్ అదుపులో ఉన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు