
సిద్ధాపూర్, 01 ఏప్రిల్ (హి.స.)
దట్టమైన నల్లమల అడవిలో కొలువై ఉన్న సలేశ్వరం లింగమయ్య సాహస యాత్ర (Saleswaram Lingamayya Adventure Tour) ఈరోజు తెల్లవారుజామున అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఏడాదికి కేవలం మూడు రోజులు మాత్రమే అనుమతి ఉండే ఈ యాత్రకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుండే భక్తులు కాలి బాట పట్టడంతో అటవీ ప్రాంతం శివనామస్మరణతో మారుమోగిపోతుంది. ప్రకృతి ఒడిలో, జలపాతాల మధ్య వెలసిన మల్లికార్జునుడిని దర్శించుకోవడానికి భక్తులు ఎంతో ఉత్సాహంగా అడవి మార్గంలో ప్రయాణిస్తున్నారు.
భక్తుల రద్దీ ఊహించని రీతిలో పెరగడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మన్ననూర్ నుండి ఫర్హాబాద్ చౌరస్తా వరకు సుమారు నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. ఇది పూర్తిగా ఘాట్ రోడ్డు కావడం, ఇరుకైన మలుపులు ఉండటంతో ట్రాఫిక్ క్లియర్ చేయడం అధికారులకు సవాలుగా మారింది. అటవీ శాఖ, పోలీసు సిబ్బంది సమన్వయంతో ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ప్రకృతి సిద్ధమైన లోయలు, కొండచరియల మధ్య సాగే ఈ యాత్ర అత్యంత సాహసోపేతమైనది కావడంతో అధికారులు భక్తులకు పలు సూచనలు చేస్తున్నారు. అడవిలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు, వన్యప్రాణులకు హాని కలగకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని కోరుతున్నారు. భారీ రద్దీ నేపథ్యంలో భక్తులు సహనంతో వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా యంత్రాంగం విజ్ఞప్తి చేస్తోంది.
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV