
కూనవరం, 18 ఏప్రిల్ (హి.స.)పోలవరం నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చేందుకు అధికారులు గ్రామ సభలను నిర్వహిస్తున్నారు. వైసీపీ శ్రేణులు సభలు జరగకుండా అడ్డుకుంటున్నాయి. వారిని దీటుగా అడ్డుకోవాల్సిన అధికార టీడీపీ శ్రేణులు నిమ్మకుండిపోతున్నాయి. ఈ మొత్తం పరిణామాలపై ఆయా గ్రామాల్లోని ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పోలవరం ప్రాజెక్టు పనులపై, నిర్వాసితుల పునరావాసంపై ఏక కాలంలో దృష్టి సారించింది. వచ్చిన మొదటి ఏడాదిలోనే కూనవరం మండలంలో తొలి విడతగా తొమ్మిది గ్రామాల్లో ఇళ్లకు సంబంధించిన పరిహారం అందించింది. ఆ దశ పూర్తవుతుండగా ఇప్పుడు ఆర్ అండ్ ఆర్ పరిహారం ఇచ్చేందుకు గ్రామాల్లో అధికారులు గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. వీటిని అడ్డుకునేందుకు వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నారు. కూనవరం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో జరిగిన గ్రామ సభలో కలెక్టర్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.
పెద్ద పెద్ద అరుపులతో గ్రామ సభలో గందరగోళం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి కూనవరం టీడీపీ మం డలాధ్యక్షుడు యడవల్లి భాస్కరరావు ప్రయత్నించారు. ఆయనతోనూ వైసీపీ శ్రేణులు గొడవకు దిగాయి. వారం రోజుల క్రితం జరిగిన గోదావరి పడవ రేవు వేలం పాటలో సైతం వైసీపీ కార్యకర్తలు ఇదే పద్ధతి పాటించి, గొడవలు సృష్టించారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చిన కలెక్టర్నూ మాట్లాడనీయకుండా వైసీపీ శ్రేణులు రగడకు దిగడం మంచిది కాదని ప్రజలు పేర్కొంటున్నారు. ప్రభుత్వం పరిహారం ఇచ్చేందుకు ముందుకు వస్తున్న సమయంలో వైసీపీ ఇలా ప్రవర్తించడం సరికాదని స్పష్టం చేస్తున్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పరిహారమివ్వలేదని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇ స్తుంటే అడ్డుకోవడం పద్ధతి కాదని నిర్వాసితులు పేర్కొంటున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ