
అమరావతి, 18 ఏప్రిల్ (హి.స.)కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్ సభలో వీగిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆయన తన ట్వీట్ లో భారత చట్టసభల్లో మహిళలకు ప్రాతినిధ్యం పెంచే చారిత్రాత్మక అవకాశాన్ని విపక్షాలు కావాలనే అడ్డుకున్నాయి. దేశ ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే, మహిళా సాధికారతకు బాటలు వేసే సంస్కరణలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం విపక్షాలకు లేదని ఆయన విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించడం ద్వారా విపక్షాలు జాతీయ ప్రగతి కంటే తమ రాజకీయ సమీకరణలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయని పవన్ కళ్యాణ్ ఆక్షేపించారు. అనేక ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఈ సంస్కరణకు మద్దతు తెలపడం ద్వారా ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ విపక్షాలు పరోక్షంగా లింగ సమానత్వాన్ని, కలుపుగోలు పాలనను జాప్యం చేస్తున్నాయి అని ఆయన పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV