
ఢిల్లీ, 18 ఏప్రిల్ (హి.స.)
భారత పౌరసత్వం పొందకముందే ఓటర్ల జాబితాలో అక్రమంగా పేరు చేర్చుకున్నారనే ఆరోపణలపై కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీపై దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్పై ఢిల్లీ కోర్టు శనివారం విచారణ చేపట్టనుంది. ఈ కేసులో ఇప్పటికే పిటిషనర్ తరఫు వాదనలు ముగియగా, సోనియా గాంధీ తరఫు న్యాయవాది వాదనలు ఇంకా పూర్తి కాలేదు.
రౌస్ అవెన్యూ కోర్టులో ఈ కేసుపై మార్చి 30న పాక్షికంగా విచారణ జరిపిన న్యాయస్థానం, తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. భారత పౌరసత్వం లేని సమయంలో సోనియా గాంధీ పేరు ఓటర్ల జాబితాలో ఎలా చేరిందనే దానిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, విచారణ జరపాలని కోరుతూ న్యాయవాది వికాస్ త్రిపాఠి ఈ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు.
విదేశీ పౌరురాలి పేరును ఫోర్జరీ పత్రాలు లేదా మోసపూరిత మార్గాల ద్వారానే ఓటర్ల జాబితాలో చేర్చి ఉంటారని పిటిషనర్ తన వాదనలు వినిపించారు. ఇందుకు ఆధారంగా ఎలక్టోరల్ రోల్స్ సర్టిఫైడ్ కాపీలను కోర్టుకు సమర్పించినట్లు తెలిపారు.
అయితే, ఈ ఆరోపణలను సోనియా గాంధీ కొట్టిపారేశారు. ఇవి పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని, నిరాధారమైనవని తన సమాధానంలో పేర్కొన్నారు. పౌరసత్వానికి సంబంధించిన అంశాలు కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి, ఎన్నికల జాబితా వివాదాలు ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తాయని ఆమె స్పష్టం చేశారు. ఫోర్జరీకి సంబంధించి ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు సమర్పించలేదని, ఇది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని వివరించారు.
గతంలో మేజిస్ట్రేట్ కోర్టు ఈ ఫిర్యాదును కొట్టివేయగా, పిటిషనర్ రౌస్ అవెన్యూ కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు, డిసెంబర్ 9, 2025న సోనియా గాంధీకి, ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi