
చెన్నై, 18 ఏప్రిల్ (హి.స.)కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లును లోక్సభలో అడ్డుకోవడంలో ప్రతిపక్షాలు ప్రదర్శించిన అసాధారణ ఐక్యతపై తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది 'ఇండియా' కూటమి సాధించిన చారిత్రక విజయమని అభివర్ణించారు. ముఖ్యంగా, పార్లమెంటులో ఈ అంశంపై గట్టిగా గళం విప్పిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఆయన పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని ఉత్తర, దక్షిణ రాష్ట్రాలుగా విడదీసేందుకు బీజేపీ పన్నిన కుట్రను 'ఇండియా' కూటమి సమష్టిగా భగ్నం చేసింది. ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఏకపక్షంగా తెచ్చిన ఈ బిల్లును వ్యతిరేకించిన మిత్రపక్షాలన్నింటికీ నా అభినందనలు అని ఆయన పేర్కొన్నారు. ఈ పోరాటంలో కీలక పాత్ర పోషించిన రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేరళ సీఎం పినరయి విజయన్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు జాతీయ నేతలకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi