
నాగులుప్పలపాడు, 03 ఏప్రిల్ (హి.స.)కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరిస్తున్న పలువురు మిల్లర్లు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనలేమని తెగేసిచెప్పడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అధికారులు, మిల్లర్లు, వ్యాపారుల మాయాజాలంతో రైతులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. మద్దతు ధరకు కొనుగోలు చేసేలా సివిల్ సప్లయీస్ అధికారులు ఒత్తిడి తీసుకురాకపోవడంతో అంతా మిల్లర్ల ఇష్టారాజ్యంగా మారింది. దీంతో దిక్కుతోచని పరిస్థితితో అన్నదాతలు దిగాలు పడుతున్నారు. వివరాల్లోకెళితే.. ఆదర్శ ఎత్తిపోతల పఽథకంగా పలుమార్లు ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకొన్న కనపర్తి ఎల్ఐ పరిధిలో ఈ ఏడాది రబీ సీజన్లో రైతులు ఐదు వేల ఎకరాలలో 1271, 1262, కేఎన్ఎం 1638, నెల్లూరు సన్నాలు రకాలను సాగు చేశారు. నెల క్రితం పంట కోతలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం అప్పట్లో ఏర్పాటు కాలేదు. దీంతో పెట్టుబడికి తెచ్చిన అప్పులు తీర్చుకునేందుకు ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
కొందరు రైతులు ధాన్యాన్ని ఇళ్లకు తరలించుకొని వాటిని కాపాడుకొనేందుకు నానాతిప్పలు పడుతున్నారు. రైతుల అభ్యర్థనలతో ఆలస్యంగా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కానీ కొనుగోళ్లు మాత్రం మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టి మిల్లులకు తరలిస్తున్నారు. కొనుగోళ్లు మందకొడిగా చేస్తుండటంతో మళ్లీ అన్నదాతకు కష్టాలు మొదలయ్యాయి. గిట్టుబాటు కావడం లేదని, ప్రభుత్వం ప్రకటించిన ధరకు కొనలేమని ఽజిల్లాకు చెందిన మిల్లర్లు కొనుగోళ్లను నిలిపివేశారు. మిల్లర్లు, వ్యాపారులు, సివిల్ సప్లయీస్ అధికారుల సమష్టి దోపిడీపైన ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అలాగే ప్రత్యేక దృష్టిసారించి కనపర్తి ఎత్తిపోతల పథకం పరిధిలో పండించిన ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోళ్లు వేగవంతంగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సివిల్ సప్లయీస్ డీఎంను వివరణ కోసం ఫోన్లో సంప్రదించగా అందుబాటులోకి రాలేదు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్