ఎమ్మెల్యే అరవింద బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్
పార్టీ పరువుకు భంగం కలిగిస్తే సహించబోనంటూ ఏపీ సీఎం బాబు నర్సారావు పేట ఎమ్మెల్యే అరవింద బాబుపై సీరియస్ అయ్యారు
AP news


అమరావతి, 03 ఏప్రిల్ (హి.స.)పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద బాబుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. పార్టీ పరువుకు భంగం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇటీవల తాను చెప్పిన వ్యక్తికి లీగల్ అడ్వైజర్ పోస్ట్ ఇవ్వలేదని అరవింద బాబు హల్ చల్ చేశారు. ఏకంగా పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ విషయం కాస్తా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లింది. ఎమ్మెల్యేతో మాట్లాడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ మేరకు ఇవాళ (శుక్రవారం) మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి అరవింద బాబును పల్లా శ్రీనివాసరావు పిలిపించారు. ఎస్పీ కార్యాలయంలో బైఠాయించడంపై వివరణ కోరారు. ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారని.. లీగల్ అడ్వైజర్ నియామకం జరగకపోతే పార్టీ జిల్లా అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్ లేదా తన దృష్టికి ఎందుకు తీసుకురాలేదని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. అంతేకాని ఇలా పార్టీ పరువుపోయేలా ప్రవర్తించడం ఏంటని నిలదీశారు. అయితే, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకుంటానని ఎమ్మెల్యే అరవింద బాబు హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande