
హైదరాబాద్, 03 ఏప్రిల్ (హి.స.)తాను స్థాపించ బోయే పార్టీకి పాత పేరు.. కొత్త అజెండాతో ప్రజల ముందుకు వస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. తమకు ప్రధాన శత్రువు అధికార కాంగ్రెస్ పార్టీనే అని స్పష్టం చేశారు. శుక్రవారం హైదరాబాద్లో విలేకర్లతో కల్వకుంట్ల కవిత ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తమ పార్టీ ప్రొ. జయశంకర్ సిద్ధాంతాల ప్రకారమే నడుస్తుందన్నారు. తమ పార్టీకి బిహార్ సిద్ధాంతకర్త ఎవరూ లేరన్నారు. బీఆర్ఎస్ ప్రస్తుతం నిద్రావస్థలో ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరు ఖాళీగా ఉందని.. దానిని ఎవరైనా వాడుకోవచ్చునని చెప్పారు. పార్టీ రిజిస్ట్రేషన్ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్ పని చేస్తోందన్నారు. పార్టీ ఆవిర్భావం రోజు.. అమరవీరుల స్తూపం వద్దకు వెళ్తామని పేర్కొన్నారు.
సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం మహిళా రిజర్వేషన్గా చేస్తే.. ఆ స్థానం నుంచి ఎన్నికల బరిలో దిగుతానన్నారు. గజ్వేల్ మహిళా రిజర్వేషన్ వచ్చినా పోటీ చేసే అంశాన్ని ఆలోచిస్తానని తెలిపారు. సీఎం రేవంత్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసి ఆ పార్టీని ఓడించారని.. అలాగే ప్రస్తుతం కేరళలో ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తారని వ్యంగ్యంగా అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్