
చెన్నై, 13 మే (హి.స.)
తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తొలిరోజే తీవ్ర వివాదంలో చిక్కుకుంది. బుధవారం ఉదయం విశ్వాస పరీక్షలో నెగ్గిన వెంటనే, రాధన్ పండిట్ వెట్రివేల్ అనే జ్యోతిష్కుడిని ముఖ్యమంత్రికి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (పొలిటికల్)గా నియమించడం పెను దుమారం రేపింది. మిత్రపక్షాలు, ప్రతిపక్షాల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకతతో ప్రభుత్వం కొన్ని గంటల్లోనే ఆ నియామకాన్ని వెనక్కి తీసుకుంది.
విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో మాట్లాడిన డీఎండీకే చీఫ్ ప్రేమలత విజయకాంత్, ఈ నియామకాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి ఓఎస్డీగా ఒక జ్యోతిష్కుడిని నియమించడాన్ని నేను ఖండిస్తున్నాను. దీని ద్వారా యువతకు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ఆయన మీ వ్యక్తిగత జ్యోతిష్కుడైతే, వ్యక్తిగతంగానే ఉంచుకోవాలి అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.
ప్రభుత్వానికి మద్దతిస్తున్న కీలక మిత్రపక్షాలైన విడుతలై చిరుతైగల్ కట్చి (వీసీకే), కాంగ్రెస్ కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది ఒక లౌకిక ప్రభుత్వంలో ఆమోదయోగ్యం కాదు. ప్రజలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడం ప్రభుత్వ కర్తవ్యం అని వీసీకే ప్రధాన కార్యదర్శి డి. రవికుమార్ పేర్కొంటూ, వెంటనే అతడిని తొలగించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ శశికాంత్ సెంథిల్ కూడా.. ఒక జ్యోతిష్కుడికి ఓఎస్డీ పదవి ఎందుకు అవసరం? అని సోషల్ మీడియాలో ప్రశ్నించారు.
విమర్శలు వెల్లువెత్తడంతో టీవీకే నేత సీటీ నిర్మల్ కుమార్ తొలుత ఈ నియామకాన్ని సమర్థించే ప్రయత్నం చేశారు. వెట్రివేల్ను మీడియా ప్రతినిధిగా నియమించామని, ఆయన వృత్తితో సంబంధం లేదని తెలిపారు. అయితే, ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఆసక్తికరంగా ఈ విషయంలో బీజేపీ విజయ్ కు అనుకూలంగా స్పందించింది.
రాధన్ పండిట్ వెట్రివేల్కు గతంలోనూ రాజకీయ ప్రముఖులతో సంబంధాలున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఆయన సలహాదారుగా వ్యవహరించినట్లు సమాచారం. అక్రమాస్తుల కేసులో ఆమె జైలుకు వెళ్లరని వెట్రివేల్ చెప్పిన జోస్యం విఫలం కావడంతో వారి మధ్య విభేదాలు వచ్చినట్లు కథనాలొచ్చాయి. ఏదేమైనా, మిత్రపక్షాల నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడి కారణంగా, విజయ్ సర్కార్ వివాదాస్పద నియామకాన్ని రద్దు చేసుకోవలసి వచ్చింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi