
అనంతపురం, 16 మే (హి.స.)
అనంతపురంనగరాన్ని వంద శాతం ప్లాస్టిక్ రహితంగా మారుస్తామని స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ స్పష్టం చేశారు. నగరంలో ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్ థీమ్ తో నిర్వహించిన 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్థానిక టవర్ క్లాక్ జంక్షన్ వద్ద ప్లాస్టిక్ వస్తువులను వాడబోమంటూ, వాటి నిర్మూలనకు కట్టుబడి ఉంటామంటూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. కేవలం అధికారులు జరిమానాలు విధిస్తారనే భయంతో ప్లాస్టిక్ వాడకాన్ని ఆపడం కాదు.. దాని వల్ల పర్యావరణానికి, మానవాళికి కలిగే ఘోరమైన అనర్థాలను ప్రతి ఒక్కరూ గ్రహించాలి.
ప్లాస్టిక్ భూమికి, మన ఆరోగ్యానికి ఒక పెద్ద మహమ్మారిలా మారింది. అందుకే దీనిని పూర్తి స్థాయిలో అరికట్టాలి. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికీ వెళ్లి ప్లాస్టిక్ నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపడతాం. అంతేకాదు, నగరంలో నిషేధిత ప్లాస్టిక్ విక్రయించే వారిపై చట్టపరంగా చాలా కఠినంగా వ్యవహరిస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని ప్లాస్టిక్ రహిత నగర నిర్మాణానికి మద్దతు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV