
కర్నూలు, 16 మే (హి.స.)
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్. నైరుతి రుతుపవనాలు నేడు దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 23-30 తేదీలలో ముఖ్యంగా 26వ తేదీన కేరళంను తాకే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ఈ నెల 19వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. అటు తెలంగాణలో ఈ నెల 18వ తేదీ వరకు వేడి గాలులు వీస్తాయని పేర్కొంది భారత వాతావరణ శాఖ.
ఇవాళ ఈ జిల్లాలో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇవాళ వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఇవాళ ఉదయం 8:30 గంటల వరకు ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. సంగారెడ్డి, నల్గొండ, కామారెడ్డి మెదక్ మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. ఇక రాబోయే రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరుగుతాయని కూడా అంచనా వేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV