
అమరావతి, 17 మే (హి.స.)
తిరుమల, తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం విస్తరణ పనుల్లో తొలిదశను టీటీడీ పూర్తిచేసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తులు మొదటి ఘాట్రోడ్డులోనే దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన మార్గంలో నడవడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పక్కనే లోయ ఉన్న క్రమంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తొలిదశలో 70 మీటర్ల మేరకు విస్తరణ పనులను గత డిసెంబరులో ప్రారంభించి, ఇటీవల పూర్తిచేసింది. గతంలో రోడ్డుపక్కనే 3 అడుగులు వెడల్పున్న నడకమార్గం ప్రస్తుతం 6 అడుగులకు విస్తరించింది. ఈ మార్గంపై షెడ్డు నిర్మాణ పనులూ పూర్తయ్యాయి. దీంతో భక్తులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా నడకను కొనసాగిస్తున్నారు. మరోవైపు మార్గానికి అత్యంత లోతైన లోయ ఉన్న క్రమంలో విస్తరణ పనులు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ