
అమరావతి, 17 మే (హి.స.)నరసరావుపేట సెంట్రల్, : రూ.3 వేలు చెల్లిస్తే రూ.3 లక్షలు వస్తాయి.. ఆ తర్వాత రూ.కోటి.. విడతల వారీగా రూ.25 కోట్లు వస్తాయని ప్రజలను నమ్మించి రాకెట్ ల్యాబ్ సంస్థ పేరుతో మోసం చేస్తున్న ముఠాను శనివారం నరసరావుపేట గ్రామీణ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. చిలకలూరిపేట మండలం గొట్టిపాడు గ్రామానికి చెందిన నాగండ్ల వెంకట్రావు, కుమారుడు వంశీ, వెంకట్రావు పీఏ నీరజ ముఠాగా ఏర్పడి రాకెట్ ల్యాబ్ పేరిట ఒక సంస్థను ఏర్పాటుచేశారు. రెండు రోజుల కిందట పట్టణ శివారులో ఇంటిని అద్దెకు తీసుకున్నారు. తెలిసిన వారి నుంచి పాన్, ఆధార్ కార్డు, ఫోన్ నంబర్లు, వివరాలు తీసుకుని అకౌంట్లు సిద్ధం చేశారు. వారు మాట్లాడుకున్న కేరళకు చెందిన అజయ్ సత్య నుంచి ఒక లింకును వారికి పంపి అందులో వివరాలు నమోదుచేస్తారు.
వెరిఫికేషన్ కోడ్ రాగానే అకౌంట్లో రూ.3 లక్షలు జమవుతాయని నమ్మించి అందుకు రూ.3 వేల చొప్పున కట్టించుకున్నారు. ఈకేవైసీ వెరిఫికేషన్ పేరిట తయారు చేసిన పుస్తకాలను చూపి అమాయకుల్ని బురిడీ కొట్టిస్తున్న విషయం తెలిసి పోలీసులు రంగంలోకి దిగారు. ముగ్గురిని అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించి విచారిస్తున్నారు. సుమారు 200 మంది వద్ద వారు రూ.3 వేల చొప్పున వసూలు చేసినట్లు తెలిసింది. బాధితులు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ